వాత తప్పదా?.. మరో రూ.20 పెరగనున్న లీటర్‌ పెట్రోల్‌?

  • ఇప్పటి వరకు రూ.7.38 పెరిగిన పెట్రో ధరలు
  • పెంపు ఇంతటితో ఆగదని నిపుణుల అంచనా
  • పశ్చిమాసియా యుద్ధంతో కంపెనీలకు భారీ నష్టాలు
  • అవే తీరే వరకు పెంపు తప్పదని అంచనా
ఇంధన ధరలు ఇప్పటికే నాలుగు సార్లు పెరిగాయి. లీటరుపై దాదాపు రూ.7.38 వరకు భారం పడింది. ఈ పెంపు ఇంతటితో ఆగదని సమాచారం. చమురు సంస్థల నష్టాల నేపథ్యంలో ధరలు మరింత పెంచక తప్పదని ఆర్థిక నిపుణులు అంటున్నారు.

తీరని నష్టాలు
ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం లాంటి ప్రభుత్వ రంగ సంస్థల నష్టాలు తాజా పెంపుతో పూర్తిగా భర్తీ కాలేదు. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు, మన రిటైల్ ధరలకు ఉన్న వ్యత్యాసాన్ని భర్తీ చేయాలంటే లీటరుపై మరో రూ.20 నుంచి రూ.33 వరకు పెంచాల్సి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే అంత భారం ఒకేసారి వేయడం సాధ్యం కాకపోయినా విడతల వారీగా బాదుడు తప్పకపోవచ్చు.

రూ.1.2 లక్షల కోట్ల భారం
ఫిబ్రవరి 28 నుంచి ఇరాన్ వివాదం వల్ల అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు భారీగా పెరిగాయి. కానీ మనదేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల కారణంగా వరుసగా 74 రోజుల పాటు ఇంధన ధరలను పెంచకుండా నిలిపివేశారు. భారత్ తన అవసరాల కోసం 88 శాతం ముడిచమురును దిగుమతి చేసుకుంటుంది. ధరలు స్థిరంగా ఉంచడం వల్ల ఈ మూడు ప్రభుత్వ రంగ సంస్థలపై ఏకంగా రూ.1.2 లక్షల కోట్లకు పైగా అదనపు భారం పడింది.

క్రూడాయిల్ తగ్గినా
ఇరాన్, అమెరికా మధ్య చర్చలు సఫలమైతే అది మన చమురు సంస్థలకు ఊరటనిస్తుంది. అయినా రవాణా ఖర్చులు, పాత నష్టాల వల్ల ధరల భారం వెంటనే తగ్గే అవకాశం లేదు. ఇటు ప్రజలపై ద్రవ్యోల్బణ భారం పడకుండా అటు చమురు సంస్థలు నష్టపోకుండా చూడటం ఇప్పుడు ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది.

Petrol price hike
Fuel price hike
Indian Oil
Bharat Petroleum
Hindustan Petroleum
Crude oil prices
Inflation India
Iran
Fuel prices India

More Telugu News